మద్నూర్, కామారెడ్డి జిల్లా:
పెళ్లిళ్లలో బంగారం, ఖరీదైన కానుకలు ఇవ్వడం సాధారణమే. కానీ మద్నూర్ మండల కేంద్రానికి చెందిన శివకుమార్ అనే యువకుడు మాత్రం తన వివాహ వేడుకలో భార్యకు ఇన్సూరెన్స్ పాలసీ బహుమతిగా ఇచ్చి అందరి ప్రశంసలు అందుకున్నాడు.
తాళి కట్టిన అనంతరం బంధుమిత్రుల సమక్షంలో ముందుగానే తీసుకున్న ఇన్సూరెన్స్ బాండ్లను భార్యకు అందజేశాడు. “భార్య భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించడం ప్రతి భర్త బాధ్యత” అని శివకుమార్ తెలిపారు.
పెళ్లిళ్లలో అనవసర ఆడంబరాలకు ఖర్చు చేసే బదులు, భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడి పెట్టడం మంచి నిర్ణయమని అతిథులు అభినందించారు. నేటి యువతకు ఈ ఘటన ఆదర్శంగా నిలుస్తోందని స్థానికులు పేర్కొన్నారు.
శివకుమార్ చేసిన ఈ వినూత్న ప్రయత్నం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
